పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో వున్నవారు తప్పుకోవాలి: హోం మంత్రి అనిత సలహా

  • హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత
  • దిశ పోలీస్ స్టేషన్ల పేరును మారుస్తామన్న హోంమంత్రి
  • సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
పోలీసులలో గత ప్రభుత్వ ఆలోచనలు ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. పోలీసులు ప్రజలకు అనుకూలంగా పని చేయాలన్నారు. ఇంతకుముందులాగే ప్రవర్తిస్తామనే పోలీసులు వాళ్లంతట వాళ్లే తప్పుకోవాలన్నారు. 'ప్లీజ్.. మీరు పక్కకు తప్పుకుంటే పని చేసేవారు వస్తారు. చంద్రబాబు కోసమో... పవన్ కల్యాణ్ కోసమో... ఎన్డీయే కోసమో పని చేయమని చెప్పడం లేదు. ప్రజల కోసం పని చేయండి' అన్నారు.

సచివాలయంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ప్రజలు, అధినేత చంద్రబాబు ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. తనను ఆశీర్వదించిన పాయకరావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.

దిశ పోలీస్ స్టేషన్ల పేరును మారుస్తామన్నారు. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామన్నారు. బాధితులు కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామన్నారు.

Vangalapudi Anitha
Telugudesam
Police

More Telugu News